ఓటర్ల ప్రత్యేక సవరణపై ప్రత్యేక ప్రచార దినాలు: జిల్లా కలెక్టర్
కడప,(ఆగస్ట్, 12): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ తెలిపారు.
2026 ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ప్రత్యేక ప్రచార దినాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా, సంబంధిత జాబితాలతో పాటు అవసరమైన 6, 7, 8, 8ఏ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచి, ఓటర్లకు దరఖాస్తుల స్వీకరణ, సందేహాల నివృత్తి, మార్గదర్శకత్వం అందిస్తారన్నారు.
18–19 సంవత్సరాల యువ ఓటర్లను పెద్దఎత్తున ఓటర్ల జాబితాలో నమోదు చేయడంతో పాటు, ముసాయిదా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన ఓటర్లను గుర్తించి చేర్చేందుకు ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రత్యేక ప్రచార దినాలపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని, రాజకీయ పార్టీలకు ముందస్తుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై భౌతిక పరిశీలన, స్థానిక విచారణ పూర్తి చేసి సంబంధిత ఎన్నికల నమోదు అధికారికి సమర్పించాలని తెలిపారు. అలాగే, స్వీకరించిన దరఖాస్తుల వివరాలను రోజువారీగా నమోదు చేయడంతో పాటు, దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రత్యేక ప్రచార దినాల్లో బూత్ స్థాయి అధికారులు విధులకు గైర్హాజరైతే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి, సంబంధిత ఎన్నికల నమోదు అధికారి, సహాయ ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారులపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.